ఢిల్లీ: చిన్న చిన్న విషయాల్లో కుటుంబాల్లో వాగ్వాదాలు జరగడం సహజం. కానీ అవి ప్రాణాలు తీసుకునే వరకూ వెళ్లవు. అయితే ఢిల్లీలోని ద్వార్కా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కోపాన్ని ముసలి తల్లిపై చూపడంతో ఆమె అక్కడికక్కడే తుదిశ్వాస విడిచింది. ఈ ఘోరం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పొరుగింటి వారితో పార్కింగ్ విషయంలో ఓ కుటుంబానికి గొడవ వచ్చింది. దీని గురించి మాట్లాడటం కోసం ఆ ఇంటికి వెళ్లిన సమయంలో 76 ఏళ్ల వృద్ధురాలు, ఆమె కుమారుడు రణ్బీర్, కోడలు శుద్రా బిస్త్ రోడ్డుపై నిలబడి వాదించుకున్నారు. ఈ సమయంలో మాటల మధ్య ఆగ్రహం తెచ్చుకున్న రణ్బీర్.. తన ముసలి తల్లిని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అలానే నేలపై పడిపోయిన ఆమె చలనం లేకుండా ఉండిపోయింది.
వాగ్వాదం జరిగే సమయంలో పోలీసులకు ఫోన్ చేసిన శుద్రా.. వాళ్లు వచ్చాక గొడవ ముగిసిందని, వారు కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులను పంపేశారు. అయితే ఆమె భర్త చేసిన ఘనకార్యం అక్కడి సీసీటీవీ ఫుటేజిలో రికార్డవడంతో వారు చేసిన ఘోరం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేయగా.. నేలపై పడి చలనం లేకుండా ఉన్న వృద్ధురాలిని శుద్రా దంపతులు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే అక్కడకు వెళ్లేసరికే ఆ ముసలి ప్రాణం గాల్లో కలిసిపోయినట్లు వైద్యులు ప్రకటించారని దర్యాప్తులో వెల్లడైంది.
కామెంట్లు లేవు:
if you have any doubts please let me know