ఐఆర్డీఏఐ తాజా మార్గదర్శకం
న్యూఢిల్లీ: కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావంతో ఎవరైనా ఆస్పత్రిలో చేరాల్సివస్తే ఆ ఖర్చులకు ఆరోగ్యబీమా పాలసీల కింద కవరేజి వర్తిస్తుందని ఐఆర్డీఏఐ తెలిపింది. ఈ విషయంలో పాలసీ దారుల్లో కొన్ని అనుమానాలున్నట్టు వచ్చిన వార్తలను దృష్టిలో ఉంచుకుని ఈ వివరణ ఇస్తున్నట్టు ఒక ప్రకటనలో వివరించింది. అయితే పాలసీలకు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలకు లోబడి మాత్రమే ఈ కవరేజి ఉంటుందని పేర్కొంది.
ఆరోగ్య సంజీవని కవరేజిలో మార్పులు: ప్రామాణిక ఆరోగ్య బీమా పాలసీ ఆరోగ్య సంజీవని కింద కవరేజి కనీస పరిమితిని రూ.50 వేలకు తగ్గించి, గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ మార్గదర్శకాల్లో ఐఆర్డీఐఏ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఈ కవరేజి పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది.
ప్రీమియం భారం పెంచొద్దు: పాలసీదారులపై ప్రీమియం భారం పెరిగే రీతిలో ఆరోగ్యబీమా పాలసీల్లో మార్పులు చేయవద్దని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఇదే ఆదేశం వ్యక్తిగత ప్రమాద బీమా, ట్రావెల్ ఇన్సూరెన్స్లకు కూడా వర్తిస్తుందని తెలిపింది. ఏవో కొత్త ప్రయోజనాలు, కొత్త లాభాల ముసుగు చూపి పాలసీల్లో మార్పులు చేసి ప్రీమియంలు పెంచడాన్ని అనుమతించేది లేదని ఒక సర్కులర్లో స్పష్టం చేసింది.
ఐఆర్డీఏఐ గత జూలైలో పాలసీ దరఖాస్తు విధివిధానాలపై జారీ చేసిన సమీకృత మార్గదర్శకాలకు లోబడి స్వల్ప మార్పులు చేయడానికి మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపింది. ఒకవేళ కొత్త ప్రయోజనాలు జత చేయాలనుకుంటే యాడ్ ఆన్ కవరేజిగా మాత్రమే జోడించి దాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ పాలసీదారులకే వదలాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. పాలసీకి సంబంధించిన పదాలన్నీ ప్రతీ ఒక్కరికీ అర్ధం అయ్యేలా సరళంగా ఉండాలని, ఈ ఏడాది అక్టోబరు నుంచి బీమా సంస్థలన్నీ ప్రామాణిక ఫార్మాట్లోనే పాలసీలు రూపొందించాలని సూచించింది.
కామెంట్లు లేవు:
if you have any doubts please let me know