అన్ని తెలుగు వార్తల సమాహారం

జగన్‌ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌- పీపీఏలపై ఊరట- ఆ ఛాయిస్‌ మీదేనంటూ..

 ఏపీలో రెండేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి రాగానే గత టీడీపీ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం తెరపైకి వచ్చింది. అప్పటివరకూ వీటిపై ఎక్కడా చర్చ లేకపోయినా వైసీపీ అధికారంలోకి రాగానే విద్యుత్‌ ఒప్పందాలు రాష్ట్రానికి గుది బండగా మారాయన్న చర్చను తెరపైకి తెచ్చింది. వీటిని సమీక్షించేందుకు దూకుడుగా ముందుకెళ్లింది. అయితే హైకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా బ్రేకులు వేయడంతో ఆ వ్యవహారం ఇక తెరమరుగైంది. ఇన్నాళ్లకు కేంద్రం విద్యుత్‌ ఒప్పందాలపై జగన్ సర్కారుకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

విద్యుత్‌ ఒప్పందాల వివాదమేంటి ? దేశంలో ప్రస్తుతం సహజసిద్ధంగా లభించే జల విద్యుత్ కంటే సంప్రదాయేతర సౌర విద్యుత్‌, పవన విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోంది. జల విద్యుత్‌ ఉత్పత్తిలో ఉన్న ఇబ్బందు దృష్ట్యా దీని కంటే చౌకగా లభించే సంప్రదాయేతర విద్యుత్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఇదే క్రమంలో సోలాల్‌, విండ్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు తెరపైకి వచ్చాయి. ఆరంభ దశలో వీటితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున ఒప్పందాలు చేసేసుకున్నాయి. తొలుత దాదాపు జల విద్యుత్‌తో సమానంగా ఉన్న వీటి ధరలు ఆ తర్వాత ఉత్పత్తి పెరిగాక బాగా తగ్గిపోయాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాల వల్ల అప్పుడు ఒప్పుకున్న ధరలు ఇప్పటికీ చెల్లించాల్సి వస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే పరిస్ధితి. జగన్‌ సర్కారు అధికారంలోకి రాగానే ఈ తేనెతుట్టెను కదిపింది.

పీపీఏలపై జగన్ సమీక్షకు బ్రేకులు

 ప్రస్తుతం మార్కెట్లో యూనిట్‌ మూడు, నాలుగు రూపాయలకు దొరుకుతున్న సోలాల్‌, విండ్‌ పవర్‌ను విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న సంస్ధలకు మాత్రం పాత ఒప్పందాల ప్రకారం 11 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తుంది. ఒక్క ఏపీలోనే ఈ ఒప్పందాల విలువ రూ.25 వేల కోట్లు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. దీంతో వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ ఈ ఒప్పందాలను సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. అంతే విద్యుత్‌ తయారీ సంస్దలు గగ్గోలు పెట్టాయి. కోర్టుల్లో కేసులు వేయడంతో పాటు కేంద్రంపైనా విపరీతమైన ఒత్తిడి తెచ్చాయి. దీంతో జగన్ అనుకున్న విధంగా వీటిపై సమీక్ష చేయడం కుదరలేదు.

పీపీఏలపై జగన్‌కు కేంద్రం ఊరట

 ఎప్పుడైతే రాష్ట్రానికి గుదిబండగా మారిన పీపీఏలపై సీఎం జగన్‌ సమీక్షకు సిద్ధమయ్యారో అప్పుడే దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. కేంద్రం ఏదైతే వద్దని కోరుకుందో అదే చర్చ సాగింది. దీంతో జగన్‌ తీరుపై కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జగన్‌ అభ్యంతరాలనే మిగతా రాష్ట్రాలు కూడా లేవనెత్తాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. ఇప్పుడు గడువు తీరిన పీపీఏలను కొనసాగించే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. గతంలో గడువు తీరినా కేంద్ర ప్రభుత్వ సంస్ధ సీజీఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను డిస్కంలు కొనసాగించాల్సి వచ్చేది. కానీ ఇక ఆ అవసరం లేదని, డిస్కంలు వాటిని ఉపసంహరించుకోవచ్చని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది

పీపీఏల ఉపసంహరణకు తాజా నిబంధనలివే


కేంద్ర ప్రభుత్వ సంస్ధ సీజీఎస్‌తో రాష్ట్రాల్లోని విద్యుత్‌ పంపిణీ సంస్ధలు (డిస్కంలు) ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగిసిపోయాక వాటిని ఉపసంహరించుకునేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఒప్పందాల గడువు పూర్తి కాగానే తమ రాష్ట్రాల్లో సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి ఉందని ఆయా డిస్కంలు కేంద్రానికి తెలియజేయాలి. అలాగే వీటికి బదులుగా అణు విద్యుత్‌ తీసుకోవాలని బావిస్తే అణు విద్యుత్‌ శాఖ అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. పీపీపీల గడువు ముగిసిన తర్వాత డిస్కంలు కోరుకుంటే మాత్రం ఒప్పందాలు పునరుద్ధరిస్తారు. డిస్కంలు ఓసారి ఒప్పందం రద్దు చేసుకున్నాక మళ్లీ అదే రేటుకు ఒప్పందం చేసుకుంటామంటే కుదరదని కేంద్రం తెలిపింది.


జగన్‌ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌- పీపీఏలపై ఊరట- ఆ ఛాయిస్‌ మీదేనంటూ.. జగన్‌ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌- పీపీఏలపై ఊరట- ఆ ఛాయిస్‌ మీదేనంటూ.. Reviewed by Manam Telugu Vaaram on 11:42 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.